క్రైస్తవ మైనారిటీలకు ఓబీఎంఎంఎస్ ద్వారా ఆర్థిక సహాయ పథకాలు ప్రారంభం
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన మంత్రి అజర్ుద్దీన్

హైదరాబాద్, జూలై 3(Zindagi9news): తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ క్రైస్తవ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGCMFC) ఆధ్వర్యంలో ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (OBMMS) ద్వారా క్రైస్తవ మైనారిటీల కోసం పలు ఆర్థిక సహాయ పథకాలను ప్రారంభించింది. కుట్టు మిషన్ పథకం, మోటార్ బైక్, ఈ-బైక్, ఈ-స్కూటీ, చిన్న వ్యాపారాల (పెటీ బిజినెస్) పథకాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజర్ుద్దీన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రైస్తవ మైనారిటీల సామాజిక, ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కుట్టు మిషన్ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందే అవకాశాలు పెరుగుతాయని, మోటార్ బైక్, ఈ-బైక్, ఈ-స్కూటీ పథకాలతో యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. చిన్న వ్యాపార పథకం ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు చేయూత అందుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ మైనారిటీల సంక్షేమ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, టీజీసీఎంఎఫ్సీ చైర్మన్ దీపక్ జాన్, ప్రభుత్వ కార్యదర్శి బి. షఫియుల్లా, మైనారిటీల సంక్షేమ శాఖ డైరెక్టర్ అబ్దుల్ హమీద్, టీజీసీఎంఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్ పి. సబితతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
21 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల క్రైస్తవ మైనారిటీ మహిళలు కుట్టు మిషన్, చిన్న వ్యాపార పథకాలకు, 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల వారు ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ.2 లక్షలలోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలలోపు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. జూలై 3 నుంచి జూలై 18 సాయంత్రం 5 గంటల వరకు tsobmms.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు.
