పోక్సో కేసు కక్షతో ఆరుగురి దారుణ హత్య.. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు బాలిక కుటుంబం హతం

షాబాద్ (రంగారెడ్డి), జూలై 11 (Zindagi9news): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ద్వాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఒకే కుటుంబాన్ని కుదిపేసిన ఘోర ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుపై కక్ష పెంచుకున్న రాజ్కుమార్ (28) అనే వ్యక్తి మొత్తం ఆరుగురిని కత్తితో దారుణంగా హత్య చేశాడు.
మృతుల్లో నిందితుడి భార్య పార్వతి సరిత (30), ఇద్దరు కుమారులు పరీక్షిత్ (3), దైవిక్షిత్ (2), అలాగే తనపై పోక్సో కేసు నమోదు చేసిన 17 ఏళ్ల మైనర్ బాలిక, ఆమె తల్లి చిట్యాల లక్ష్మి (45), నానమ్మ చిట్యాల రుక్మమ్మ (65) ఉన్నారు. గత మే నెలలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో రాజ్కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లిన అతడు ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. ఈ కేసుపై కక్ష పెంచుకున్న రాజ్కుమార్ ముందుగా తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం బాలిక ఇంటికి వెళ్లి బాలిక, ఆమె తల్లి, నానమ్మను కత్తితో నరికి చంపినట్లు రాజ్కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఆరుగురిని హత్య చేసినట్లు తెలిపి పరారైనట్లు సమాచారం. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.సమాచారం అందుకున్న ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
