అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి
నేటి యువతకు సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిదాయకం: డా. వి. నరేందర్ రెడ్డి

కరీంనగర్, ఆగస్టు 18 (Zindagi9news): స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నేతాజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. చిన్నతనం నుంచే దేశభక్తిని పెంపొందించుకున్న నేతాజీ, దేశ స్వాతంత్ర్యం కోసం అంకితభావంతో పోరాడి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు.
నేటి యువత నేతాజీని ఆదర్శంగా తీసుకోవాలని, దేశం పట్ల విధేయత, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరింత ప్రభావితం చేయడంతో పాటు యువతలో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు నేతాజీ కృషి చేశారని తెలిపారు.
కార్యక్రమంలో పలువురు విద్యార్థులు నేతాజీ వేషధారణలో హాజరై ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గేయాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
