జులై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం.. రాష్ట్రవ్యాప్తంగా 1–19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండాజోల్ మాత్రలు

హైదరాబాద్, జులై 12 (జిందగి9న్యూస్): తెలంగాణ ప్రభుత్వం జులై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day–NDD) నిర్వహించనుంది. జులై 20న మాప్-అప్ డే నిర్వహించి, మొదటి రోజు మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు ఆల్బెండాజోల్ (Albendazole 400 mg) మాత్రలు అందజేయనున్నారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల ద్వారా 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల పిల్లలకు వయస్సుకు అనుగుణంగా ఆల్బెండాజోల్ మాత్రలను ఒకే మోతాదుగా ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేగు నులిపురుగుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడం, రక్తహీనత నివారణ, పిల్లల ఎదుగుదల, చురుకుదనం, పాఠశాల హాజరు మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 96,81,855 మంది పిల్లలకు మందులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యాశాఖ, మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ తదితర విభాగాల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
మాత్రల మోతాదు:
1–2 సంవత్సరాల పిల్లలు: అర మాత్ర (నూరి ఇవ్వాలి)
2–3 సంవత్సరాల పిల్లలు: ఒక మాత్ర (నూరి ఇవ్వాలి)
3–19 సంవత్సరాల పిల్లలు: ఒక మాత్ర (నమిలి మింగాలి)
ముఖ్య సూచనలు:
వయస్సుకు అనుగుణంగా మాత్రను నూరి లేదా నమిలి ఇవ్వాలి.
మాత్ర తీసుకున్న తర్వాత 2–3 గుక్కల నీరు తాగించాలి.
ఇంట్లో స్వయంగా ఇవ్వకుండా, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు లేదా కళాశాలల్లో అధికారుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలని ఆరోగ్య శాఖ సూచించింది.
