కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్ల భారీ అక్రమాలు.. ఇద్దరు యజమానులపై కేసు నమోదు!

ఇల్లందకుంట: ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ విషయంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు రైస్ మిల్ యజమానులపై ఇల్లందకుంట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే..తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ (TGCSCL) నిబంధనల ప్రకారం కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యాన్ని తీసుకున్న బుజునూర్ గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ (యజమాని: గూడూరి మాధవి), ఇల్లందకుంటలోని శ్రీ హనుమాన్ సీతారామాంజనేయ రైస్ మిల్ (యజమాని: కాసుబోజుల నర్సయ్య) ప్రభుత్వానికి అందజేయాల్సిన బియ్యాన్ని సకాలంలో ఇవ్వకుండా దుర్వినియోగానికి పాల్పడ్డారు.సివిల్ సప్లైస్ అధికారులు, నాయబ్ తహసీల్దార్ సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించారు. జిల్లా మేనేజర్ ఎం. రజనీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
