కలప తరలింపుదారుల నుంచి లంచం వసూలు.. ఏసీబీ కి చిక్కిన ఫారెస్ట్ అధికారులు

నాగర్కర్నూల్, ఆగస్టు 18 (Zindagi9news): నల్లమల అటవీ ప్రాంతం నుంచి కలపను తరలిస్తున్న వారిని అడ్డుకుని, అటవీ కేసు నమోదు చేసి ఎద్దుల బండ్లను సీజ్ చేస్తామని బెదిరించి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అటవీ అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) క్రిమినల్ మిస్కండక్ట్ కేసు నమోదు చేసింది. లింగాల ఫారెస్ట్ కార్యాలయానికి చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామ్బాబు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మురళీకృష్ణ ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్నారు.
ఏసీబీ వివరాల ప్రకారం.. తొలుత రూ.1.20 లక్షలు లంచం డిమాండ్ చేసిన అధికారులు అనంతరం రూ.50 వేలకు తగ్గించారు. దీంతో ఫిర్యాదుదారు రూ.28 వేలను PhonePe ద్వారా, మరో రూ.22 వేలను నగదు రూపంలో చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం అధికారిక రసీదు జారీ చేసేందుకు మరో రూ.6 వేలు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ACB అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
