సెప్టెంబర్లోపు తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పూర్తి.. భారీగా గృహప్రవేశాలు: కలెక్టర్ చిత్రా మిశ్రా
రెండో విడతలో గుడిసెల్లో నివసించే నిజమైన పేదలకు ప్రాధాన్యం.. కరీంనగర్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆదేశం

కరీంనగర్, జూలై 17 (Zindagi9News): తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్లోపు పూర్తి చేసి, పెద్ద ఎత్తున గృహప్రవేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల పురోగతి, బిల్లుల చెల్లింపులు, గృహప్రవేశాల నిర్వహణలో కరీంనగర్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
తొలి విడత పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో నిజమైన అర్హులైన పేదలను, ముఖ్యంగా గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించి ప్రాధాన్యంతో ఎంపిక చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని, ప్రతి అర్హ కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, జెడ్పీ డిప్యూటీ సీఈవో, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
