పోలీస్ డీఎస్పీపై అక్రమాస్తుల కేసు
ఏసీబీ సోదాల్లో భారీ ఆస్తుల వెలికితీత.. 15 చోట్ల తనిఖీలు

హైదరాబాద్, జూలై 2(Zindagi9news): తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (పీసీఎస్)లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెల్లడించింది. సేవా కాలంలో అక్రమ మార్గాల ద్వారా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో గురువారం ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సోదాల్లో హైదరాబాద్, గచ్చిబౌలి, టెలికాం నగర్, తెల్లాపూర్, నాగోల్, పటాన్చెరు, మణికొండ, వికార్ాబాద్, సంగారెడ్డి, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో విల్లా, ఇండ్లు, ఫ్లాట్లు, వాణిజ్య భవనాల్లో వాటాలు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు గుర్తించారు. అలాగే రూ.3.60 లక్షల నగదు, బినామీ నివాసంలో మరో రూ.40 లక్షల నగదు, సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, రూ.19.91 లక్షల బ్యాంకు నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా 23 విదేశీ మద్యం సీసాలు కూడా గుర్తించడంతో సంబంధిత చర్యల కోసం ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఏసీబీ తెలిపింది.
ఆస్తుల మార్కెట్ విలువ పత్రాల విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అదనపు ఆస్తులపై విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
