ఏసీబీ వలలో అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు.. రూ.5.92 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తింపు

హైదరాబాద్కు చెందిన సస్పెండ్ అయిన అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) నాయిని భుజంగరావుపై అక్రమాస్తుల కేసును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసింది. విధుల్లో ఉన్న సమయంలో అవినీతి చర్యలు, అనుమానాస్పద మార్గాల ద్వారా తన ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
జూన్ 3న భుజంగరావు నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలు, అనుబంధ వ్యక్తులకు చెందిన మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సోదాల్లో వెలుగులోకి వచ్చిన ఆస్తులు
• సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 27.29 ఎకరాల వ్యవసాయ భూములు
• ఐదు ఓపెన్ ప్లాట్లు
• రెండు ఇళ్లు
• హైదరాబాద్లో ఒక వాణిజ్య భవనం
• నగదు రూ.3.83 లక్షలు
• బ్యాంకు ఖాతాల్లో రూ.8 లక్షల నిల్వలు
• సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు
• ఒక మారుతి స్విఫ్ట్ కారు
• ఒక కియా సెల్టోస్ కారు
ఈ సోదాల్లో గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.5,92,54,500గా ఏసీబీ అంచనా వేసింది. అయితే మార్కెట్ విలువ పత్రాల్లో చూపిన విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
భుజంగరావు నివాసంలో నిర్వహించిన తనిఖీల్లో 29 మద్యం సీసాలు కూడా గుర్తించినట్లు వెల్లడించారు. దీనిపై అవసరమైన చర్యల కోసం ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
ఇంకా అదనపు ఆస్తులపై విచారణ కొనసాగుతోందని, నిందితుడిని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
