విధుల పట్ల నిర్లక్ష్యం.. సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, విధుల పట్ల అలసత్వం ప్రదర్శించిన నేపథ్యంలో సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ ఎస్. అశ్రిత్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డా. టి.కె. శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
జూన్ 2న నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతం తదితర కార్యక్రమాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలను అశ్రిత్ కుమార్ సక్రమంగా అమలు చేయలేదని జిల్లా కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు.
కార్యక్రమ స్థలంలో మున్సిపల్ సిబ్బంది హాజరు ఉండేలా చూడడంలో, అవసరమైన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని, జిల్లా పరిపాలన ఇచ్చిన లిఖితపూర్వక ఆదేశాలను పాటించకపోవడంతో పరిపాలనా పరమైన లోపాలు చోటుచేసుకుని జిల్లా యంత్రాంగానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని నివేదికలో వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా, ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, నియంత్రణ, అప్పీలు) నియమావళి-1991లోని రూల్-8 ప్రకారం అశ్రిత్ కుమార్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యలు, విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
