నార్సాపూర్ : ఏసీబీ వలలో ఏడీఈ.. రూ.25 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టివేత

హైదరాబాద్/నార్సాపూర్, మే 22 (Zindagi9News): మెదక్ జిల్లా నార్సాపూర్ డివిజన్ ఆపరేషన్స్లో పనిచేస్తున్న అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE) ముద్దం రమణారెడ్డి అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడికి సంబంధించిన 11 వర్క్ బిల్లులు (మొత్తం విలువ రూ.3,13,882) మెదక్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయానికి పంపేందుకు ముద్దం రమణారెడ్డి రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పక్కా ప్రణాళిక ప్రకారం వల పన్నారు.
శుక్రవారం (మే 22) మధ్యాహ్నం 12:40 గంటల సమయంలో నార్సాపూర్లోని తన కార్యాలయంలో లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి, రమణారెడ్డిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అనంతరం నిందితుడిని అరెస్టు చేసి, హైదరాబాద్లోని రెండో అదనపు ప్రత్యేక న్యాయమూర్తి (SPE & ACB కేసులు) ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. ప్రస్తుతం కేసుపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేసినా, ప్రజలు వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించాలని అవినీతి నిరోధక శాఖ విజ్ఞప్తి చేసింది.
