
జమ్మికుంట, జూన్ 26 (జిందగీ 9 న్యూస్):
వర్షాకాలంలో ప్రబలే డయేరియా (అతిసార వ్యాధి) వంటి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వైద్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, హుజురాబాద్ డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ చందు ఆదేశాల మేరకు వావిలాల ఆరోగ్య ఉప కేంద్ర పరిధిలోని వావిలాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమాన్ని హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో కలుషిత త్రాగునీరు, అపరిశుభ్ర వాతావరణం వల్ల డయేరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఓఆర్ఎస్ పాకెట్లు, జింకు మాత్రలను ముందస్తుగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమం వచ్చే నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.
డయేరియా లక్షణాలు, నివారణ చర్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సదానందం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు, ఏఎన్ఎం రమ, అంగన్వాడీ టీచర్ హజరత్, ఉపాధ్యాయురాలు శిరీష, ఆశా కార్యకర్త మనీ తదితరులు పాల్గొన్నారు.
