
పెబ్బేరు మున్సిపాలిటీ మేనేజర్ గణేష్ బాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనన ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన బాధితులు అతని ప్రవర్తనపై మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
బాధితుల ప్రకారం, పౌర సేవల కోసం వచ్చి చాలా రోజులుగా వేచి ఉన్నప్పటికీ, మేనేజర్ ఇష్టానుసారంగా పని చేస్తున్నాడని, ప్రజలను నిందిస్తూ, దుర్భాషలాడుతూ, విస్మయానికి గురిచేస్తున్నాడని తెలిపారు. కమిషనర్ సూచనలు కూడా పట్టించుకోకుండా “నేనే రాజు నేనే మంత్రి – ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని వారు ఆరోపించారు.
గణేష్ బాబు గతంలో మున్సిపల్ కమిషనర్గా కొద్ది రోజులు బాధ్యతలు చేపట్టిన అనంతరం, అశోక్ రెడ్డి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించగా, అప్పటి నుంచి గణేష్ బాబు అధికార పద్దతిని పాటించక, కమిషనర్ మాట కూడా పట్టించుకోవడం లేదని సిబ్బంది పేర్కొన్నారు.
పెబ్బేరు ప్రజల అభిప్రాయం ప్రకారం, మున్సిపల్ కార్యాలయంలో ప్రజల అవసరాలకు తగిన స్పందన లేకుండా పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరం. చదువుకున్న వారు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుండగా, సాదాసీదా ప్రజల పరిస్థితి మరింత దుర్భరంగా ఉందని వారు వాపోతున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు బాధితులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. పైరవీ ఉన్నవారికి సేవలు వేగంగా పూర్తవుతుండగా, సామాన్యులకు మాత్రం నిర్లక్ష్యం చూపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
