తెలంగాణ గిరిజన రైతులకు భూ హక్కులు – “ఇందిర సౌర గిరి జల వికాసం” ప్రారంభం
నల్లమల డిక్లరేషన్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

నాగర్కర్నూల్, మే 19: తెలంగాణలో గిరిజనుల అభివృద్ధికి కొత్త దిశగా, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం “ఇందిర సౌర గిరి జల వికాసం” అనే వినూత్న పథకాన్ని ప్రారంభించింది.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో “నల్లమల డిక్లరేషన్”ను సీఎం గారు మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ఆలయాన్ని దర్శించి సభలో ప్రసంగించారు.
“పదిహేడు నెలల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని నిరూపించాం. ఇప్పుడు అది సరిపోదు, ఇంకా ముందుకు వెళ్లాలి” అని సీఎం అన్నారు.

అచ్చంపేట మోడల్ను విస్తరించనున్న ప్రభుత్వం
ప్రతి రైతుకు సోలార్ పంపు సెట్ ఇవ్వడం ద్వారా విద్యుత్పై ఆధారపడకుండా సాగు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని సీఎం తెలిపారు. అచ్చంపేటలో విజయవంతమైన మోడల్ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
నల్లమల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
నల్లమల ప్రాంతానికి సాగునీరు, ఉపాధి, విద్య వంటి అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు. అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది.
రైతులకు సంక్షేమ పథకాలు
రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, 200 యూనిట్లలోపు ఉచిత గృహ వినియోగ విద్యుత్, బోనస్, సన్న బియ్యం వంటి పథకాలతో రైతులకు మద్దతు ఇస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రిమండలి సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
