
మనస్తాపంతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
జమ్మికుంట, మార్చి 15(zindagi9news):మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఆదివారం జమ్మికుంటలో చోటుచేసుకుంది. స్థానికులు మరియు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి (జమ్మికుంట) నివాసి అయిన వడ్లకొండ విజయ్ కృష్ణ (40) అరటి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు.గత కొంతకాలంగా ఆయన తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఆయనను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించి, మందులు వాడుతున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. వ్యాధి నయం కావడం లేదన్న మనస్థాపంతో విజయ్ కృష్ణ ఈరోజు సాయంత్రం జమ్మికుంట రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో వెళ్తున్న KPCC గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు విడిచారు.
సమాచారం అందుకున్న రామగుండం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ (రామగుండం) జి. తిరుపతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
