జమ్మికుంటలో ఎంపీ బండి సంజయ్ చిత్రపటానికి వినూత్న వినతి పత్రం
జమ్మికుంట: యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల ఆధ్వర్యంలో వినూత్నంగా ఎంపీ బండి సంజయ్ చిత్రపటానికి వినతి పత్రం సమర్పించారు. జమ్మికుంట పట్టణంలోని పాత అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజాప్రతినిధిగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సజ్జు, మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ, జమ్మికుంట రైల్వే స్టేషన్లో కొత్తపల్లి-జమ్మికుంట మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వేగంగా చేపట్టాలని, కరీంనగర్-తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును రోజువారీ నడిపించాలని డిమాండ్ చేశారు. అలాగే, దక్షిణ్ ఎక్స్ప్రెస్, నవజీవన్, గ్రాండ్ ట్రంక్ వంటి ముఖ్య రైళ్లను జమ్మికుంటలో ఆపాలని కోరారు.
ఇక ఇల్లంతకుంట దేవస్థాన అభివృద్ధికి కూడా నిధులు తీసుకురాలేదని విమర్శించారు. ఎంపీ రామజపం మాత్రమే చేస్తూ ప్రజల అభివృద్ధిపై ఆసక్తి లేకుండా వ్యవహరిస్తున్నారని యువజన కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో దొడ్డె సంధ్య నవీన్, రోమాల రాజ్ కుమార్, పాతకాల రమేష్, రాచపల్లి సాగర్, దేవునూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, బిజిగిరి శ్రీకాంత్, పతకాల ప్రవీణ్, పచ్చిమట్ల భాను, ఏరెడ్డి సతీష్, రాగల్ల శివ, బండి పవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.

