జమ్మికుంట, ఏప్రిల్ 20: జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో 1999-2000 విద్యా సంవత్సరంలో 10వ తరగతిని పూర్తిచేసిన విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత పాఠశాలలో మళ్లీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశం హృదయాన్ని హత్తుకునేలా సాగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ – “మా జీవితాలను దిశానిర్దేశం చేసిన మా ఆచార్యుల సేవలు మేము మరచిపోలేము. క్రియాశీల, నిస్వార్థంగా మాకు బోధించిన గురువులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని భావోద్వేగంగా తెలిపారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మా విద్యా పూర్వాచార్యులైన క్రియాశీల శిక్షకులు కనబోయిన కొమురయ్య, జూపాక రవీంద్ర చారి, పలకల రమేష్ రెడ్డి లను స్మరించుకుంటూ, వారి సేవలను స్మరణగా నిలుపుకుంటామని పేర్కొన్నారు.
అనంతరం పూర్వ విద్యార్థులంతా తమకు బోధించిన ఉపాధ్యాయులను సన్మానించారు. పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములమవుతూ, పాఠశాలకు అండగా నిలవాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో 40 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం జిల్లా కార్యదర్శి తేళ్ళ రాజమౌళి, పాఠశాల సమితి అధ్యక్షులు ఆవాల రాజిరెడ్డి, కార్యదర్శి ఆకుల రాజేందర్, ప్రబంధకారిణి అధ్యక్షులు శీలం శ్రీనివాస్, కార్యదర్శి దాసరి రవీందర్, పూర్వ ఉపాధ్యాయులు బుర్ర శివయ్య, చేరుకు సోమయ్య, డింగరి రవికుమార్, అకినపల్లి వీరప్రసాద్, శ్రీనివాస్, దూడం సాంబయ్య, చందుపట్ల నాగయ్య, వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానాచార్యులు గుడికందుల సుదర్శన్ పాల్గొన్నారు.
