వనపర్తి జిల్లా ( Zindagi9news ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ వ్యవహారాలు వనపర్తి జిల్లాలో రోజురోజుకు దిగజారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో పాటు, కొన్ని పేరులకే పరిమితమైన మిల్లులకు భారీగా ధాన్య కేటాయింపులు జరుగుతున్నాయి.
పెబ్బేరు మండలానికి కేటాయించిన ధాన్యం, జోగులాంబ గద్వాల జిల్లాలోని ఓ గోదాంలో నిల్వ చేయడం, ప్రాథమికంగా నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తోంది. అలాగే, బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లర్కు మళ్లీ కొత్త పేరుతో బాయిల్డ్ మిల్లుగా భారీ ఎత్తున కేటాయింపులు జరగడం చర్చనీయాంశమైంది.
2022-23 వానాకాలం, 2023-24 ఖరీఫ్, రబ్బి సీజన్లలో ఇచ్చిన ధాన్యానికి సంబంధించి ఇప్పటికీ సీఎంఆర్ అప్పగించని మిల్లర్కి మరోసారి ధాన్యం ఇవ్వడం పట్ల మిగిలిన మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ఓ కాశీవిశ్వనాథ్ బృందం చేసిన తనిఖీలోనూ, మిల్లులో నిల్వలు లేకపోవడం.. మిల్లుకు రెండు కోడ్లు ఉండటం బయటపడటంతో అధికారుల దుష్ప్రవర్తన బట్టబయలైంది.
ఇంకా విచారకరమైంది ఏంటంటే, అదే యజమానికి చెందిన మరో మిల్లుకి కొత్తగా ధాన్యం కేటాయించడం. పేర్లు వేరైనా, స్వామి ఒక్కరే అని తెలిసినప్పటికీ కేటాయింపులు ఆపకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చిట్యాల గోదాం వద్ద ఒక్కరోజులో 30 లారీల ధాన్యాన్ని తరలించినట్లు తెలిసింది. సప్తగిరి రైస్ మిల్కి చెందిన ధాన్యం బీచుపల్లి వద్ద నిల్వ చేయడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని సంబంధిత అధికారులు అంగీకరించినా చర్యలు తీసుకోకపోవడం దారుణం.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగితే, మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అధికారుల గోప్య ఒప్పందాలతో నడుస్తున్న ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
