జమ్మికుంట, ఏప్రిల్ 4: కరీంనగర్ జిల్లా క్షయ నియంత్రణ సంస్థ మరియు జమ్మికుంట టిబి యూనిట్ ఆధ్వర్యంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో టిబి బాధితులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని ఆరోగ్య ఉపకేంద్రం-1 వద్ద ఈనెల నిక్షయ్ పోషణ యోజన పథకం కింద న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ మొలుగు చందన మాట్లాడుతూ, టిబి వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా రూ.1000 ఆర్థిక సహాయం అందించబడుతోందని, దీనితో పాటు పోషకాహార కిట్లు కూడా ఇవ్వబడుతున్నాయని తెలిపారు. టిబి వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తిస్థాయిలో 6 నెలల మందుల కోర్సు పూర్తి చేస్తే వ్యాధి పూర్తిగా నయం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఉచిత మందులు, నిక్షయ్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ రత్న కుమారి, టిబి సూపర్వైజర్ దేవేందర్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది సరళ, మంజుల, సాజిదా, రజిత, రాదా, నరేందర్, ఎన్జీవో తిరుపతి మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
