
కరీంనగర్ : హనుమాన్ దీక్షాపరుల కోసం సామాజిక సేవలో ముందుండే VNR ఫౌండేషన్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు అల్ఫోర్స్ డా. వి. నరేందర్ రెడ్డి స్థానికంగా హనుమాన్ దీక్షాపరులు, భక్తుల సౌకర్యార్థంగా ఏర్పాటు చేసిన చల్లని నీటి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దీక్షాపరులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొని ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “సమాజ సేవ చేయడం వలన ఎంతో తృప్తి లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు మనపై ఉండాలంటే సేవే మార్గం” అని అన్నారు డా. నరేందర్ రెడ్డి.
అలాగే, ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జీవించి, పరస్పర సోదరభావంతో అభివృద్ధి వైపు పయనించాలి అని సూచించారు. హనుమాన్ సేవను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
అంతేకాకుండా, కొండగట్టులో హనుమాన్ దీక్షాపరుల కోసం మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. “స్వామివారి జయంతి దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎన్నో శుభఫలాలు లభిస్తాయి” అని పేర్కొన్నారు.
ఉగ్రవాదాన్ని సైతం భక్తి శక్తితో ఎదుర్కోవచ్చని, భగవంతుని సేవలో తరించడం మన జన్మ కర్తవ్యమని తెలిపారు. ప్రజలంతా తమ తమ గృహాల్లో పెద్ద హనుమాన్ జయంతిని భక్తి భావంతో జరుపుకోవాలని, సమూహ కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, హనుమాన్ దీక్షాపరులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
