
కరీంనగర్ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత
సీపీ గౌష్ ఆలం నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ
కరీంనగర్, డిసెంబర్ 4:
జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నట్లు పోలీసు కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. మూడవ విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గురువారం ఆయన స్వయంగా పరిశీలించారు.
వీణవంక, జమ్మికుంట, హుజురాబాద్, ఇల్లందుకుంట, సైదాపూర్ మండలాల్లో నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
చల్లూరు, మామిడాలపల్లి, జగ్గయ్యపేట, వల్భాపూర్, నాగంపేట, టేకుర్తి, పెద్దపాపయ్యపల్లి, చిన్నపాపయ్యపల్లి వంటి సమస్యాత్మక కేంద్రాలను సీపీ సందర్శించి భద్రతా చర్యలను సమీక్షించారు. పోలింగ్ రోజు అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నట్లు అన్నారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని రౌడీషీటర్లను హెచ్చరించిన సీపీ, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గత ఎన్నికల నేర చరిత్ర ఉన్నవారిపై బైండోవర్ చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించిన సీపీ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హుజురాబాద్ ఏసీపీ మాధవి, ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, కరుణాకర్, రామకృష్ణ, ఎస్సైలు ఆవుల తిరుపతి, క్రాంతికుమార్ తదితరులు ఈ పర్యవేక్షణలో పాల్గొన్నారు.
