“ఓటు చోర్ మోడీ హటావో – దేశ్ కి బచావో” నినాదాలతో కాంగ్రెస్ యూత్ నిరాహార దీక్ష

కరీంనగర్ : ప్రధాని మోడీ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఓట్లు దొంగిలించే ప్రభుత్వానికి ప్రతీకగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. “ఓటు చోర్ మోడీ హటావో – దేశ్ కి బచావో” నినాదాలతో శనివారం కరీంనగర్ గీతా భవన్ చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
ఈ దీక్షలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జిల్లా అధ్యక్షుడు ఉమ్మెంతుల శ్యాంసుందర్ రెడ్డికి నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు.
ఈ సందర్భంగా శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీ పెద్దలు విచ్చలవిడిగా ఓట్లు దొంగిలిస్తున్నారని, దీనిపై కాంగ్రెస్ అగ్రనేతలు ఆధారాలతో సహా బట్టబయలు చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఓట్ల చోరీపై తక్షణమే స్పందించి నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, గత ఎన్నికల మాదిరిగా పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు.
దీక్ష కార్యక్రమానికి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రావణ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బోయిన కృష్ణబాబు, కిమ్ ఫహద్, సయ్యద్ సజాద్, పొన్నం మధు, తాళ్లపల్లి శ్రీకాంత్, ఎండి అజీమ్, ఎల్కపెళ్లి సిద్ధార్థ, వడ్డేపల్లి విష్ణువర్ధన్, ఉమ్మెత్తుల ఆశీష్ రెడ్డి, దూడ శ్రీకాంత్, మాట్ల రాజేష్, శనిగరపు దినేష్, వినీత్, సూరం సాయి, మహిళా నాయకురాలు రాజేశ్వరి అనూష తదితరులు పాల్గొన్నారు.
