కరీంనగర్: భారత రాజ్యాంగానికి భవిష్యత్లో ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మజ్లిస్ పార్టీ దేశద్రోహ పార్టీగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం జాతీయవాద భావజాలంతో ముందుకు సాగుతుందన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని తెలిపారు. ఒవైసీ సహా లౌకిక వాదులు ఎంతగా అడ్డుకున్నా ఈ బిల్లు పార్లమెంట్లో త్వరలోనే ఆమోదం పొందుతుందని స్పష్టం చేశారు. దేశ ప్రజల కోసం మోదీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోదని పేర్కొన్నారు.
కరీంనగర్లో బండి సంజయ్కు ఘనసన్మానం
కరీంనగర్ జిల్లా కోర్టు కాంప్లెక్స్లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం బండి సంజయ్ రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు బండి సంజయ్కు ఘనసన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్, కార్యదర్శి బేతి మహేందర్, బాస సత్యనారాయణ, కోమాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక సహాయం
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, “ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశాను. నాపై 109 కేసులున్నాయి. పలుమార్లు జైలుకు వెళ్లాను. ప్రతిసారి నన్ను న్యాయవాదులే కాపాడారు. వారి సంక్షేమం కోసం అన్నివిధాలా సహాయపడతా. న్యాయవాదుల కాన్ఫరెన్స్ హాల కోసం సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రూ.50 లక్షలు మంజూరు చేసేందుకు నా వంతు కృషి చేస్తా,” అని తెలిపారు.
వక్ఫ్ బోర్డు బిల్లుపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
బండి సంజయ్ మాట్లాడుతూ, “వక్ఫ్ బోర్డు బిల్లుపై మజ్లిస్ నేత ఒవైసీ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. దేశమంతా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతోంది. ఒవైసీలాంటి వారెవరైనా వచ్చినా ఈ బిల్లు ఆగదు. పార్లమెంట్లో తప్పకుండా ఆమోదం పొందుతుందనే నమ్మకం ఉంది.
దేశ ప్రజల ఆస్తిపాస్తులను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకున్నాం. పార్లమెంట్ సంఘం నివేదికను సమర్పించింది. అతి త్వరలో ఈ బిల్లు ఆమోదం పొందడం తథ్యం. మతపరంగా దీనిని అడ్డుకోవడం సరికాదు. అలాంటి వారిపై ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది,” అని హెచ్చరించారు.
వక్ఫ్ బోర్డు సమస్యలపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
“వక్ఫ్ బోర్డు పేరుతో పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్లోనే ఓ కుటుంబం తరతరాలుగా ఉన్న ఇంటిని వక్ఫ్ బోర్డు స్థలమని పేర్కొని అనుమతులను రద్దు చేసింది. ఇలాంటివి దేశవ్యాప్తంగా ఉన్నాయి. అందుకే ప్రజల హక్కులను కాపాడేందుకు ఈ బిల్లును తీసుకువచ్చాం. దీన్ని మతపరంగా చూపి రెచ్చగొట్టాలని కొందరు చూస్తున్నారు. ఒవైసీ సహా లౌకిక వాదులు ఎంత అడ్డుకున్నా ఈ బిల్లు ఆగదు. దేశ శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది,” అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
