పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీపై బిఆర్ఎస్వి నిరసన
హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో SSC బోర్డు ముట్టడి నిర్వహించారు.

బిఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ, సీమాంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలతో కుమ్మక్కై ప్రశ్నపత్రాలు అమ్ముకునే కుట్రలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భాగమైందని, విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పరీక్షల ముందు సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం వల్లే నకిరేకల్, మంచిర్యాల, వికారాబాద్, జుక్కల్లలో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని విమర్శించారు.

బిఆర్ఎస్వి ప్రధాన డిమాండ్లు:
✔ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి.
✔ ఇప్పటివరకు నాలుగు పరీక్షలు నిర్వహించగా, నాలుగు ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం.
✔ కార్పొరేట్ పాఠశాలలతో కుమ్మక్కై కాంగ్రెస్ ఎమ్మెల్యేలే లీకేజీలకు పాల్పడటం సిగ్గుచేటు.
✔ ప్రశ్నపత్రాల లీకేజీ గురించి ప్రశ్నించిన బిఆర్ఎస్వి నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తక్షణం ఆపాలి.
✔ పోలీసులు ప్రభుత్వ ఒత్తిడికి లోనవకుండా న్యాయపరంగా వ్యవహరించాలి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
బిఆర్ఎస్వి నేతలు మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనకు అసలు నిందితులను కాపాడుతూ, నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పేషి నుంచే ఆదేశాలు వచ్చాకే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని, కానీ లీకేజీకి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
బిఆర్ఎస్వి స్పష్టం చేస్తూ, పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, చటారి దశరథ్, కాటం శివ, నర్సింగ్, శ్రీను నాయక్, మిద్దె సురేష్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్ రావు, కల్వ నితీష్, సాయి గౌడ్, రాకేష్, రెహమాత్ తదితరులు పాల్గొన్నారు.
