
మేడారం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు
జంపన్న వాగులో నిరంతర నీరు – మేడారం ఆలయాన్ని జాతీయ–అంతర్జాతీయ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం
ఆదివాసీ వీరవనితలు సమ్మక్క–సారలమ్మ కొలువైన మేడారం జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించేలా రామప్ప – లక్నవరం నుంచి పైప్లైన్ ద్వారా నీటిని తరలిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అలాగే ఈ పుణ్యక్షేత్రాన్ని తిరుమల–తిరుపతి, కుంభమేళాలను తలపించేలా ప్రతినిత్యం భక్తులు సందర్శించేలా మేడారం ఆలయ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
సమ్మక్క–సారలమ్మ మహాజాతర వేడుకల్లో సీఎం పాల్గొనడం
సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సోదర–సోదరీమణులకు జాతర శుభాకాంక్షలు తెలియజేశారు.
—
“ఇది జీవితాంతం గుర్తుండిపోయే అవకాశం” – సీఎం
గుడిలేని తల్లులను గుండెనిండా నింపుకుని జరుపుకునే అతిపెద్ద మేడారం జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిగా సంతృప్తినిచ్చాయన్నారు.
2023 ఫిబ్రవరి 6న ఆలయాన్ని సందర్శించినప్పుడు ఇచ్చిన హామీ మేరకు, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు.
వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, జాతర ప్రారంభమయ్యే జనవరి 28 నాటికి పనులు పూర్తిచేశామని తెలిపారు.
మేడారం ఆలయ పునరుద్ధరణ తనకు జీవితకాలం గుర్తుండిపోయే ఘట్టం అని, ప్రజలకు ఉపయోగపడే పని చేశామన్న సంతృప్తి కలిగిందని చెప్పారు.
—
చారిత్రక కేబినెట్ సమావేశం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగానీ, తెలంగాణలోగానీ హైదరాబాద్ బయట కేబినెట్ సమావేశం జరగని సందర్భంలో, ఆదివాసీ ఆరాధ్య దైవాల పుణ్యక్షేత్రమైన మేడారంలో మంత్రిమండలి సమావేశం నిర్వహించడం చారిత్రకమని సీఎం పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తామని వివరించారు.
– Zindagi9News
