
హుజూరాబాద్లో దొంగతనాల మిస్టరీ ఛేదన
హుజూరాబాద్, సెప్టెంబర్ 06:
జల్సాలు, పేకాట వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు వరుస దొంగతనాలకు పాల్పడి వృద్ధుల వద్ద నుంచి బంగారు గొలుసులు అపహరించిన కేసును హుజూరాబాద్ పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుండి రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం, జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, వీణవంక ఎస్సై అవుల తిరుపతి, సిబ్బంది వీణవంక మండలం చల్లూర్ గ్రామం శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కోర్కల్ గ్రామానికి చెందిన కొలిపాక రవి (37) అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో రవి అనేక దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. జల్సాలు, పేకాట వ్యసనాల కోసం రాత్రివేళల్లో ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులు అపహరించేవాడు. దొంగిలించిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో బాండు పెట్టి, డబ్బుతో మహారాష్ట్ర గడ్చందుర్లో పేకాట ఆడేవాడు. సంపాదించిన డబ్బును మళ్లీ జల్సాలకు ఖర్చు చేసేవాడు.
కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై అవుల తిరుపతి, సిబ్బంది మోహన్, కోమల్, ప్రశాంత్, రమేష్, మహేష్లను ఏసీపీ మాధవి ప్రత్యేకంగా అభినందించారు.
