జమ్మికుంట, మార్చి 18, 2025: నగదు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లిన వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తి మోసం చేసి రూ.40,000 లు తీసుకున్న ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం, జమ్మికుంట ఎంప్లాయిస్ కాలనీకి చెందిన కలకొండ తిరుమల రావు (74) మార్చి 18వ తేదీన వీణవంక రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు వెళ్లారు. అయితే, ఏటీఎంలో ఆయన ముందు నుంచే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి నగదు డ్రా చేయడానికి ప్రయత్నించాడు. కానీ డబ్బులు రాకపోవడంతో “సార్, నా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. మీ కార్డు ఇవ్వండి, చూద్దాం” అని చెప్పాడు.
తిరుమల రావు నమ్మకంతో తన ఏటీఎం కార్డు ఇచ్చాడు. ఆ వ్యక్తి “మీరు స్వయంగా పిన్ కొట్టండి” అని చెప్పడంతో తిరుమల రావు తన చేతులతో పిన్ నంబర్ నమోదు చేశారు. అయితే, వెనక నిలిచిన వ్యక్తి ఆ పిన్ నంబర్ గమనించి, ఫిర్యాదికర్త వెళ్లే సమయంలో అసలు కార్డు తీసుకొని, బోగస్ కార్డు ఇచ్చేశాడు.
కొద్దిసేపటి తర్వాత తిరుమల రావుకు రూ. 40,000 లు నగదు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో మోసపోయిన విషయం అర్థమైంది. వెంటనే ఆయన జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల స్పందన
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఏటీఎం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల హెచ్చరిక
🔹ఏటీఎం ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
🔹తనిఖీ చేయకుండా ఎవరికీ తమ కార్డు ఇచ్చే ప్రమాదం వద్దు.
🔹ఏటీఎం పిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో ఇతరుల నుంచి దూరంగా ఉండాలి.
🔹అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
