హైదరాబాద్: యువతకు ఆర్థికంగా అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకంలో దరఖాస్తుదారుల క్రెడిట్ హిస్టరీ కీలకం కానుంది. ఇప్పటికే పథకం కింద భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, గతంలో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని చెల్లించనివారి దరఖాస్తులను తిరస్కరించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ (CIBIL Score) వివరాలు, లోన్ రిపేమెంట్ హిస్టరీ వంటి అంశాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత, దరఖాస్తులను వడపోసే అవకాశం ఉంది.
అధికారుల అంచనాల ప్రకారం, మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 40 శాతం వరకు అప్లికేషన్లు తిరస్కరించబడే అవకాశం ఉంది. దీనివల్ల పథకానికి అర్హులైన నిరుద్యోగ యువతకు మాత్రమే ఆర్థిక సహాయం అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
యూనిట్ ఖర్చు ఆధారంగా సబ్సిడీ–లోన్ శాతాలు ఇలా:
🔹₹50,000 వరకు ఖర్చుతో ఉండే చిన్న ప్రాజెక్టులపై 100% సబ్సిడీ లభిస్తుంది. బ్యాంకు రుణం అవసరం లేదు.
🔹₹50,001 – ₹1,00,000 మధ్య ఖర్చు ఉన్న యూనిట్లకు 90% సబ్సిడీ, మిగతా 10% బ్యాంకు రుణం రూపంలో ఇవ్వబడుతుంది.
🔹₹1,00,001 – ₹2,00,000 మధ్య ఖర్చు ఉంటే 80% సబ్సిడీ, 20% బ్యాంకు రుణం అందుతుంది.
🔹₹2,00,001 – ₹4,00,000 ఖర్చుతో ఉండే యూనిట్లకు 70% సబ్సిడీ, మిగతా 30% బ్యాంకు రుణంగా ఇవ్వనున్నారు.
ఈ విధంగా, యువత వారి ప్రాజెక్టు స్థాయి ఆధారంగా తగిన మౌలిక సహాయం పొందవచ్చు. అయితే, బ్యాంకులు రుణం ఇచ్చే ముందు దరఖాస్తుదారుల క్రెడిట్ హిస్టరీను పరిశీలించనున్నాయి. గతంలో లోన్ తీసుకుని తిరిగి చెల్లించనివారి దరఖాస్తులు తిరస్కరించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో, గతంలో ఎలాంటి లోన్లు తీసుకోకపోయిన లేదా తీసుకుని సమయానికి తిరిగి చెల్లించిన దరఖాస్తుదారులకు ఎక్కువ అవకాశాలు ఉండనున్నాయి. కాబట్టి, దరఖాస్తుదారులు తమ క్రెడిట్ స్కోర్ను ముందుగానే పరిశీలించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

Yes