మద్యం మత్తు… మొబైల్ దొంగతనం ఆరోపణ… బెదిరింపులు… చివరకు యువకుడి ఆత్మహత్య!

జమ్మికుంట, ఆగస్టు 5 (Zindagi9News):
జమ్మికుంట సమీపంలోని మడిపల్లి రైల్వే గేట్ వద్ద ఓ యువకుడు ఉరివేసుకొని మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. కనగర్తి గ్రామానికి చెందిన రాసమల్ల అజయ్ (19) అనే యువకుడు మృతుడిగా గుర్తించారు.
మృతుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం – అజయ్, తన స్నేహితులతో కలిసి 02-08-2025 న జమ్మికుంటకు వెళ్లి వస్తున్న సమయంలో మడిపల్లి వద్ద రైలు గేటు మూసి ఉండడంతో అక్కడే మద్యం సేవించాడు. అదే సమయంలో కమలాపూర్ మండలం, భీంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ను మద్యం మత్తులో తీసుకువచ్చినట్లు పేర్కొన్నాడు.
తర్వాత రోజు, ఆ వ్యక్తి అయిన వీరన్న మరియు అతని కుమారుడు అజయ్ ఇంటికి వచ్చి – “నీ కొడుకు మా మొబైల్ తీసుకొచ్చాడు” అంటూ బూతులు తిట్టి, బెదిరించి వెళ్లిపోయినట్లు తెలిపారు.
ఈ ఘటన తరువాత, 05-08-2025 ఉదయం 6:30 గంటలకు అజయ్ ఎవరితో చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో, ఫిర్యాదిదారుడి బావ అయిన బచ్చలి కొమురయ్య ఫోన్ చేసి, అజయ్ మృతదేహం మడిపల్లి రైల్వే గేట్ సమీపంలోని చెట్టుకి ఉరివేసుకొని కనిపించిందని తెలిపాడు.
తన కుమారుడి మృతి పట్ల అనుమానం ఉన్నదని తెలిపిన రాసమల్ల ఐలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
