
పేషెంట్లతో కిక్కిరిసిన జూలూరుపాడు పీహెచ్సీ – సిబ్బంది కొరతతో ప్రజలు ఇబ్బందులు
జూలూరుపాడు, సెప్టెంబర్ 27 (Zindagi9News):
మండల కేంద్రంలోని ప్రాథమిక చికిత్స కేంద్రం (పీహెచ్సీ)లో రోగుల రద్దీ పెరిగి పోతోంది. రోజుకు 200 మందికి పైగా ఓపీలు వస్తున్నప్పటికీ, సరిపడా సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో, ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి చికిత్స లభిస్తుందనే నమ్మకంతో ప్రజలు ఇక్కడికి చేరుతారు. అయితే, అక్కడ పరిస్థితి మరోలా ఉంది. చికిత్స కోసం రోగులు మూడు నాలుగు గంటలపాటు వేచి చూడాల్సి వస్తోంది. ఆసుపత్రిలో రోజూ ఇద్దరు మాత్రమే స్టాఫ్ నర్సులు ఉండటం గమనార్హం.
డాక్టర్లు ఉన్నప్పుడు నర్సులు లేరు, నర్సులు ఉన్నప్పుడు డాక్టర్లు లేరు. ల్యాబ్లో రక్తపరీక్షల రిపోర్టులు రావడానికి రెండు మూడు రోజులు పడుతోంది. మెడికల్ షాప్ తరచూ మూసి ఉండటం వల్ల మందులు కూడా సులభంగా అందడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మండల ప్రజలు మాట్లాడుతూ – “24 గంటలు అందుబాటులో ఉండే విధంగా స్టాఫ్ నర్సులు, డాక్టర్లు నియమించాలి. సిబ్బంది కొరతను తక్షణమే తీర్చాలి” అని డిమాండ్ చేస్తున్నారు.
