ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సరసమైన నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మార్చి 7న ‘జన్ ఔషధి దివస్’ను నిర్వహిస్తారు. ఈ దినోత్సవాన్ని జనరిక్ ఔషధాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం జరుపుకుంటారు. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు (PMBJK) అనే ప్రత్యేక ఔషధ విక్రయ కేంద్రాల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను అందించడం ప్రధాన లక్ష్యంగా ఉంది.
ఈ నేపథ్యంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో ఆరోగ్య ఉపకేంద్రాల వైద్య సిబ్బంది ప్రజలకు జనరిక్ ఔషధాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. జనరిక్ ఔషధాలను అందరికీ సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రధాని భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) ద్వారా నాణ్యమైన మందులు సరసమైన ధరలకు అందుతున్నాయని, ప్రజలు వీటిని వినియోగించుకోవాలని సూచించారు. జనరిక్ ఔషధాల ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, అందుబాటు ధర నాణ్యతలో రాజీ పడదని నొక్కి చెప్పడం, అధిక ధరలు మెరుగైన నాణ్యతను సూచిస్తాయనే అపోహను తొలగించడం, జనరిక్ ఔషధాల ప్రిస్క్రిప్షన్లను ప్రోత్సహించడం వంటి అంశాలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రాజేష్, ఆరోగ్య ఉపకేంద్రాల వైద్యులు డాక్టర్ మహోన్నత పటేల్, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ హిమబిందు, డాక్టర్ ఫరహానుద్దీన్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ విజయ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్లు అరుణ, రత్నకుమారి, సదానందం, దేవేందర్ రెడ్డి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
