హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. కమలాపూర్ మండలం ఉప్పల్ బస్టాండ్ వద్ద మంగళవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో, రాంగ్ రూట్లో వచ్చిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైకును ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు, మృతి చెందిన వ్యక్తి రాములపల్లి గ్రామానికి చెందిన రామ్ రెడ్డిగా గుర్తించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ సంస్థ బాధ్యత వహించి న్యాయం చేయాలంటూ హుజురాబాద్-పరకాల ప్రధాన రహదారిపై మృతదేహంతో బైఠాయించారు. దీంతో రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఘటనా స్థలానికి చేరుకున్న కమలాపూర్ సీఐ హరికృష్ణ ఆందోళనకారులతో చర్చలు జరుపుతూ శాంతింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
