
అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఘనంగా ‘ఖేల్ ఉత్సవ్’
కరీంనగర్ : అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో “ఖేల్ ఉత్సవ్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — విద్యార్థుల్లో క్రీడా పట్ల ఆసక్తిని పెంపొందించి, వారు ఇష్టపడే క్రీడలలో శిక్షణ పొందేందుకు పాఠశాలలు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల శారీరక మరియు మానసిక అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు.
పాఠశాల స్థాయిలో నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్రీడా శిక్షణ అందిస్తూ, వివిధ స్థాయిల పోటీలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వార్షిక ప్రణాళికలో భాగంగా ఈ ఉత్సవం నిర్వహించామని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బాలల దినోత్సవం సందర్భంగా బహుమతులతో సత్కరించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఫుట్బాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, నెట్బాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
