మీ సేవ వాట్సాప్ ద్వారా పదో తరగతి ఫలితాలు.. రేపు మధ్యాహ్నం 2:30 గంటల నుండి అందుబాటులో!
హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రేపు విడుదల కానున్న ఎస్సెస్సీ (SSC) ఫలితాలను ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే సెల్ ఫోన్ ద్వారా క్షణాల్లో పొందే వెసులుబాటును కల్పించింది. తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం, మీ సేవ వాట్సాప్/చాట్బాట్ ద్వారా ఫలితాలను అందించనుంది.
రేపు మధ్యాహ్నం 2:30 గంటల నుండి..
ఏప్రిల్ 29, 2026 (బుధవారం) మధ్యాహ్నం 2:30 గంటల నుండి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. వెబ్సైట్లలో ట్రాఫిక్ సమస్యల వల్ల కలిగే జాప్యాన్ని నివారించేందుకు ఈ డిజిటల్ సేవ ఎంతో దోహదపడనుంది.
వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందే విధానం:
పదో తరగతి ఫలితాలను సులభంగా పొందేందుకు విద్యార్థులు ఈ క్రింది దశలను అనుసరించాలి:
నెంబర్ సేవ్ చేసుకోండి: మీ మొబైల్లో 8096958096 నంబర్ను “MeeSeva Telangana” పేరుతో సేవ్ చేసుకోండి.
మెసేజ్ పంపండి: వాట్సాప్ ఓపెన్ చేసి సదరు నంబర్కు “Hi” అని మెసేజ్ పంపండి.
సర్వీస్ ఎంపిక: చాట్లో “SSC Result” అని టైప్ చేయండి.
ఓపెన్ సర్వీస్: మెనులో కనిపించే ‘Open Service’ ఎంపికపై క్లిక్ చేయండి.
హాల్ టికెట్ నంబర్: మీ హాల్ టికెట్ నంబర్ను నమోదు చేయండి.
మెమో డౌన్లోడ్: వివరాలు సమర్పించిన వెంటనే మీ మార్కుల మెమో వాట్సాప్లోనే ప్రత్యక్షమవుతుంది.
డిజిటల్ విప్లవం దిశగా మరో అడుగు
ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో మీ సేవ సేవలు మరింత పారదర్శకంగా, సామాన్యులకు చేరువగా మారుతున్నాయి. నవంబర్ 18, 2025న ప్రారంభమైన ఈ వాట్సాప్ చాట్బాట్ సేవలకు ఇప్పటికే ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. జనన, ఆదాయ ధృవీకరణ పత్రాలు, పోలీస్ చలాన్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపులతో పాటు ఇప్పుడు ఎస్సెస్సీ ఫలితాలను కూడా చేర్చడం డిజిటల్ సేవలలో ఒక మైలురాయిగా నిలవనుంది.

