శాంతిభద్రతల పరిరక్షణకు ‘సాక్ ఐ’ అస్త్రం
సోషల్ మీడియాపై ఏఐ ఆధారిత నిఘా ప్రారంభించిన హైదరాబాద్ సిటీ పోలీసులు

హైదరాబాద్, మే 18 (జిందగీ9న్యూస్): నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సోషల్ మీడియా కార్యకలాపాలపై కఠిన నిఘా ఉంచేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు ‘సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ (సాక్ ఐ)’ పేరుతో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత అత్యాధునిక వ్యవస్థను ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలను వేగంగా గుర్తించి చర్యలు తీసుకోవడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.
Hyderabad City Police ఐటీ విభాగం రూపొందించిన ఈ ‘సాక్ ఐ’ వ్యవస్థ ద్వారా సోషల్ మీడియా పర్యవేక్షణ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో జరుగుతుంది. గతంలో భారీగా సిబ్బంది అవసరమై గంటల తరబడి మాన్యువల్గా చేయాల్సిన పనులు ఇప్పుడు వేగంగా, నిరంతరాయంగా నిర్వహించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఈ వ్యవస్థలోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డ్యాష్బోర్డ్ ద్వారా డయల్-100 కాల్స్, అంతర్గత నిఘా సమాచారం, నగరంలో చోటుచేసుకుంటున్న ప్రధాన ఘటనల వివరాలను ఒకే వేదికపై సమీకరించి అధికారులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పించనుంది.
ప్రయోగాత్మక దశలోనే ‘సాక్ ఐ’ మంచి ఫలితాలు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో పురానాపూల్ ఎక్స్రోడ్ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరంగా సున్నితమైన అంశాలను, గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించిన 126 సోషల్ మీడియా పోస్టులను ఈ వ్యవస్థ గుర్తించినట్లు తెలిపారు. అభ్యంతరకర కంటెంట్ను సకాలంలో తొలగించేలా చర్యలు తీసుకోవడంతో విద్వేషాలను అరికట్టడం సాధ్యమైందన్నారు.
మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రత, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలను కూడా ఈ ఏఐ వ్యవస్థ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తుంది. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నివేదిస్తుంది.
అదనంగా, నేరగాళ్ల నెట్వర్క్ విశ్లేషణ, ప్రజల ఫిర్యాదుల పర్యవేక్షణ, నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపులపై ముందస్తు నిఘా వంటి ఫీచర్లను కూడా ఇందులో పొందుపరిచారు. కీలక పదాల ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ ముప్పు ఉన్నట్లయితే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, సమాజంలో అశాంతిని రేకెత్తించే శక్తులను అరికట్టడం, మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వడం కోసం ఈ ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేశామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసే నేరగాళ్లను అత్యాధునిక సాంకేతికతతో సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
