లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు సూచించండి.. రూ.లక్ష బహుమతి
ఎల్ఐజీ హౌసింగ్ స్కీంకు హౌసింగ్ బోర్డు వినూత్న పోటీ

హైదరాబాద్, జూన్ 24(Zindagi9news): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అల్పాదాయ వర్గాల (ఎల్ఐజీ) కోసం క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారు చేసేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రతిష్టాత్మక పథకానికి మంచి పేరును నేరుగా ప్రజల నుంచే స్వీకరించాలని నిర్ణయించిన హౌసింగ్ బోర్డు, ఉత్తమమైన పేరును సూచించిన వ్యక్తికి రూ.1 లక్ష నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ నెల 28 వరకు బహిరంగ పోటీ నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతం తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ పరిధిలో అల్పాదాయ వర్గాల ప్రజల కోసం లక్ష ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని పేర్కొన్నారు. ప్రజల సొంతింటి కలలను సాకారం చేయడంలో హౌసింగ్ బోర్డుకు మంచి పేరు ఉందని, గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో పథకానికి పేరు ఎంపిక బాధ్యతను ప్రజలకే అప్పగించినట్లు తెలిపారు. హౌసింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఇన్స్టాగ్రామ్ ఖాతా ‘tghd.official‘ ద్వారా పోటీలో పాల్గొనవచ్చని వివరించారు. క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ఐజీ ఫ్లాట్ల నిర్మాణానికి అవసరమైన భూములను ఇప్పటికే గుర్తించామని, త్వరలో దరఖాస్తుల స్వీకరణ, లాటరీ విధానం, ఇతర మార్గదర్శకాలను ప్రకటించనున్నట్లు తెలిపారు.
