ప్రైవేట్ స్కూళ్లు–బుక్ సెల్లర్ల కుమ్మక్కు?.. అధిక ధరలతో పుస్తకాల విక్రయాలపై ఆందోళన

అధిక ధరలకు పుస్తకాల విక్రయాలు.. ప్రైవేట్ స్కూళ్లు, బుక్ సెల్లర్లపై చర్యలు తీసుకోవచ్చని నిపుణుల సూచన
హైదరాబాద్, జూన్ 21(Zindagi9news): ప్రైవేట్ పాఠశాలలు నిర్దిష్ట బుక్ సెంటర్ల ద్వారా కమిషన్ ప్రాతిపదికన పాఠ్యపుస్తకాలను విక్రయిస్తూ, మార్కెట్ ధరల కంటే అధిక మొత్తాలను వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల తల్లిదండ్రులను ఒకే బుక్ స్టోర్ నుంచి పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
అలాగే, పుస్తకాల కొనుగోలు సమయంలో కంప్యూటర్ బిల్లులు లేదా జీఎస్టీ ఇన్వాయిస్లు ఇవ్వకుండా సాధారణ కాగితాలపై రసీదులు అందజేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుల హక్కులు దెబ్బతింటున్నాయని, పన్ను ఎగవేతకు అవకాశం కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను నిర్దిష్ట దుకాణాల నుంచే పుస్తకాలు కొనుగోలు చేయాలని బలవంతం చేయకూడదని, మార్కెట్ ధరల కంటే అధికంగా వసూలు చేసినట్లు ఆధారాలు ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో), మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో), వినియోగదారుల సంరక్షణ శాఖ లేదా వాణిజ్య పన్నుల శాఖకు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
అధిక ధరలకు విక్రయాలు, సరైన బిల్లులు ఇవ్వకపోవడం, కమిషన్ ఆధారిత వ్యవహారాలపై ఫిర్యాదులు రుజువైతే సంబంధిత ప్రైవేట్ పాఠశాలలు, బుక్ సెల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
