నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం.. ఆగస్టు 7 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు

కోల్కతా, జూలై 17 (Zindagi9News): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 500 అసిస్టెంట్ (క్లాస్-III) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
మొత్తం 500 పోస్టుల్లో జనరల్ (UR) విభాగానికి 185, ఓబీసీకి 125, ఎస్సీకి 75, ఈడబ్ల్యూఎస్కు 75, ఎస్టీకి 40 పోస్టులు కేటాయించారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ప్రాంతీయ భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.22,405 నుంచి రూ.62,265 లు వరకు వేతనంతో పాటు మెడికల్ బెనిఫిట్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, గ్రాట్యుటీ, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ జూలై 18 నుంచి ప్రారంభమై, ఆగస్టు 7తో ముగుస్తుంది. ప్రిలిమినరీ పరీక్షను సెప్టెంబర్ 2026లో, మెయిన్ పరీక్షను అక్టోబర్ 2026లో నిర్వహించే అవకాశం ఉంది.
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు [నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అధికారిక వెబ్సైట్](https://nationalinsurance.nic.co.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్ష వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించాలని తెలిపారు.
