
వావిలాలలో మెగా వైద్య శిబిరం విజయవంతం – 155 మందికి ఉచిత వైద్యం
జమ్మికుంట: తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా స్పెషలిస్ట్స్ వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిబిరాన్ని వావిలాల గ్రామ సర్పంచ్ కొండా అర్జున్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ కొండా అర్జున్, వైద్యాధికారిణి డాక్టర్ వరుణ, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ నుండి వచ్చిన నిపుణులైన వైద్యుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎముకల, దంత, కంటి, పిల్లల వైద్యం (పీడియాట్రిక్స్), గైనకాలజీ మరియు జనరల్ మెడిసిన్కు సంబంధించిన సేవలు అందుబాటులో ఉంచారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సూచించారు. తెలుపు రంగు కాటన్ దుస్తులు ధరించడం, తలకు టోపీ లేదా గుడ్డ కట్టుకోవడం, రోజుకు 3 నుండి 5 లీటర్ల నీరు తాగడం, అవసరమైనప్పుడు ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవడం వంటి సూచనలు చేశారు.
ఈ మెగా వైద్య శిబిరంలో మొత్తం 155 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదనంగా 37 మందికి ల్యాబ్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించి తదుపరి పరీక్షల కోసం పంపించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండా అర్జున్, డాక్టర్ వరుణ, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ సతీష్, హెల్త్ సూపర్వైజర్లు అరుణ, సదానందం, స్పెషలిస్ట్ వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, ఫార్మసిస్టు రాజశ్రీధర్ రావు, నర్సింగ్ ఆఫీసర్ సాయికుమార్, ఏఎన్ఎంలు రమ, కవిత, హైమావతి, రజిత, సంధ్యారాణి, పంచాయతీ సెక్రటరీ రాజు తదితరులు పాల్గొన్నారు.

