టీచర్ మందలింపుతో ఎల్కేజీ విద్యార్థి మృతి.. విశాఖలో విషాదం

విశాఖపట్నం: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో భయపడిన ఓ ఎల్కేజీ విద్యార్థి కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం.
స్థానిక లిటిల్ గార్డెన్ స్కూల్లో ప్రణయ్ తేజ్ (6) అనే విద్యార్థి హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో బాలుడు భయంతో గుక్కపెట్టి ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలి టీచర్పై పడిపోయినట్లు తెలిపారు. వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను చూసిన తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. విద్యార్థి మృతికి అసలు కారణాలు, టీచర్ చర్యలపై అధికారిక దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
