
అవినీతి ‘ఎక్సైజ్’ నెట్వర్క్ గుట్టురట్టు: ఏసీబీ వలలో సీఐ, ప్రభుత్వ టీచర్!
కరీంనగర్ ప్రతినిధి(Zindagi9News): అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కరీంనగర్ జిల్లాలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మరియు అతనికి సహకరించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడుల్లో భారీగా నగదుతో పాటు కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
డిజిటల్ మామూళ్ల పర్వం
కరీంనగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గుండెటి రాము, గతంలో వేములవాడ ఎస్హెచ్ఓగా ఉన్న సమయంలో ఓ బెల్లం వ్యాపారి నుంచి భారీగా మామూళ్లు వసూలు చేసినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, నేరుగా నగదు తీసుకోకుండా తన బినామీగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జక్కని వేణును వాడుకున్నాడు. 2022 నుంచి 2024 వరకు యూపీఐ (UPI) ద్వారా అక్రమ సొమ్మును వేణు బ్యాంక్ ఖాతాలకు మళ్లించి, అక్కడి నుంచి తన కుటుంబ సభ్యుల ఖాతాలకు చేరవేసినట్లు అధికారులు గుర్తించారు.
సోదాల్లో రూ. 20 లక్షలు సీజ్
నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందాలు, నిందితుడు రాము నివాసంలో జరిపిన సోదాల్లో రూ. 20 లక్షల లెక్కచూపని నగదును స్వాధీనం చేసుకున్నాయి. బినామీ లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలు, బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా అధికారులు సేకరించారు.
టెక్నాలజీని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడినా తప్పించుకోలేమని ఏసీబీ అధికారులు ఈ కేసు ద్వారా నిరూపించారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ లావాదేవీలను సైతం ట్రాక్ చేసి నిందితులను పట్టుకోవడం విశేషం.
>
