
గూడూరు ‘గడప’ దాటని ఐస్ క్రీమ్ బండ్లు!
నిర్ణయం ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా: అల్లూరి జిల్లా చింతూరు మండలంలో గ్రామస్తుల సంచలనం
(నేరడూరు – జిందగీ9న్యూస్ ప్రతినిధి):పిల్లల ఆరోగ్యం విషయంలో ఆ గ్రామం రాజీ పడలేదు. రసాయనాలతో కూడిన ఆహార పదార్థాల కంటే తమ బిడ్డల క్షేమమే ముఖ్యమని భావించిన అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం గూడూరు గ్రామస్థులు ఒక వినూత్నమైన, కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోకి ఐస్ క్రీమ్ బండ్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ తీర్మానం చేశారు.
మద్యం తర్వాత.. ఐస్ క్రీమ్ వంతు!
గూడూరు గ్రామం సామాజిక మార్పుకు చిరునామాగా మారుతోంది. గతంలో గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న మద్యం బెల్ట్ దుకాణాలను గ్రామ పెద్దలందరూ ఏకమై నిలిపివేయించారు. మద్య రహిత గ్రామంగా మార్చిన అదే స్ఫూర్తితో, ఇప్పుడు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఐస్ క్రీమ్ బండ్లపై దృష్టి సారించారు.
అనారోగ్యమే ప్రధాన కారణం..
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు సొంతంగా ఐస్ క్రీమ్లు తయారు చేసి, బండ్లపై గ్రామాల్లోకి వచ్చి విక్రయిస్తున్నారు.
🔹 రసాయనాల భయం: ఆ ఐస్ క్రీమ్లలో ఎలాంటి రసాయనాలు, రంగులు వాడుతున్నారో తెలియదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
🔹పిల్లల ఇబ్బందులు: ఈ ఐస్ క్రీమ్లు తిన్న చిన్న పిల్లలకు తరచుగా దంత సమస్యలు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని గుర్తించారు.
🔹 కఠిన నిబంధన: నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఐస్ క్రీమ్ బండ్లను గ్రామంలోకి తెస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ఊరి ముఖద్వారం వద్ద భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
“పిల్లల భవిష్యత్తు మరియు ఆరోగ్యం కోసమే వారం క్రితం ఈ నిర్ణయం తీసుకున్నాం. గ్రామ పెద్దలందరి మద్దతుతో ఈ తీర్మానం అమలు చేస్తున్నాం.”
— మడివి రాజు, బాడిషా వెంకటేశ్ (స్థానికులు)
గూడూరు గ్రామస్థులు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామాజిక చైతన్యానికి ఈ గ్రామం మారుపేరుగా నిలుస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.
