కరీంనగర్లో గణేష్ మండపాలకు ఉచిత కరెంట్

కరీంనగర్, ఆగస్టు 18 (Zindagi9news): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మండపాలకు అయ్యే విద్యుత్ బిల్లులను కరీంనగర్ కార్పొరేషన్ చెల్లిస్తుందని వెల్లడించారు.
కరీంనగర్లో ఏటా దాదాపు 2 వేల గణేష్ మండపాలు ఏర్పాటు అవుతున్నాయని, గత మూడేళ్లుగా వాటి విద్యుత్ ఛార్జీలను తానే సొంతంగా చెల్లిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ప్రస్తుతం కార్పొరేషన్ ద్వారా అన్ని మండపాలకు ఉచిత విద్యుత్ అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
గణేష్ ఉత్సవాలను భక్తియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ట్రాఫిక్కు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
కరీంనగర్ పర్యటనలో భాగంగా విద్యానగర్లోని శ్రీరాంనగర్ కాలనీలో రూ.కోటి మున్సిపల్ సాధారణ నిధులతో సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం 16వ డివిజన్లోని లక్ష్మీపూర్, మల్కాపూర్ కాలనీల్లో రూ.15 లక్షలతో వాటర్ పైప్లైన్ పనులకు భూమిపూజ చేశారు.
కరీంనగర్ను అభివృద్ధి, ఉత్సవాల నిర్వహణలో తెలుగు రాష్ట్రాల్లోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని బండి సంజయ్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లంతా కలిసి నగర అభివృద్ధికి పనిచేయాలని కోరారు.
