
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. గుండాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నడిమిగూడెం బీట్ ఆఫీసర్ మరియు సాయనపల్లి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న బానోత్ నరేష్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు.
వెంకటాపురం రెవెన్యూ గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుని తండ్రికి ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల పట్టా పోడు భూమి సాగు విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు నరేష్ రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు. గుండాలలోని తన కార్యాలయంలో ఆ నగదును స్వీకరిస్తున్న సమయంలో ACB అధికారులు ఆకస్మికంగా దాడి చేసి అతన్ని పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుండి లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ACB అధికారులు తెలిపారు.
