ఉస్మానియాలో అరుదైన ఐదు అవయవాల మార్పిడి విజయవంతం
వైద్య బృందాన్ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జూలై 1(Zindagi9news): ఏకబిగిన 36 గంటలపాటు శ్రమించి ఒకే రోగికి ఐదు అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన రికార్డును సృష్టించారని పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఉస్మానియా వైద్య బృందం ఈ అరుదైన ఘనత సాధించడం గర్వకారణమని సీఎం అన్నారు. వైద్య బృందం సేవలు వైద్య వృత్తికి మరింత ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు.
