
నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు బోగీల్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్, మే 15: హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఆగి ఉన్న హైదరాబాద్–జైపూర్ ఎక్స్ప్రెస్ రైలు బోగీల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులోని B1, B2 బోగీలలో మంటలు చెలరేగడంతో స్టేషన్ పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
సమాచారం ప్రకారం, రాత్రి 7.30 గంటలకు బయలుదేరాల్సిన రైలు సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో ప్లాట్ఫామ్ వద్ద నిలిచి ఉండగా బోగీల నుంచి పొగలు రావడం రైల్వే అధికారులు గుర్తించారు. వెంటనే ఫైర్ సిబ్బంది, హైడ్రా కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న హైడ్రా DRF సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సమన్వయంతో పనిచేసిన సిబ్బంది అగ్నిప్రమాదాన్ని వేగంగా నియంత్రించారు.
అయితే ఘటన సమయంలో బోగీల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
