తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాలు, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఇప్పటికే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు 9,214 టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 57 లక్షల టన్నుల ధాన్యం సేకరించి, రైతుల ఖాతాల్లో రూ.10 వేల కోట్ల చెల్లింపులు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గోదాములను పరిశీలించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రెవెన్యూ, ఐఅండ్పీఆర్, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి పూర్వ కరీంనగర్, వరంగల్ జిల్లాలు, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ధాన్యం కొనుగోలు పరిస్థితులను పరిశీలించారు.
