అల్ఫోర్స్లో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
డాక్టర్లుగా రాణిస్తున్న పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం

కరీంనగర్, జూలై 1(Zindagi9news): స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్నార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు డాక్టర్ బి.సి. రాయ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో వైద్యుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపే ప్రాణరక్షకులు వైద్యులేనని కొనియాడారు. వైద్యులు అందించే సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని, వారి త్యాగం ఎనలేనిదని పేర్కొన్నారు.
అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో పదో తరగతి పూర్తి చేసి ప్రస్తుతం వివిధ వైద్య కళాశాలల్లో మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్లుగా సేవలందిస్తున్న పూర్వ విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. వారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ల విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు పలు నాటికలను ప్రదర్శించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
