రెడ్కో డివిజనల్ ఇంజినీర్పై ఏసీబీ అక్రమాస్తుల కేసు.. రూ.28.14 కోట్ల ఆస్తులు గుర్తింపు
హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు
ఫ్లాట్లు, వాణిజ్య భవనాలు, బంగారం, నగదు, వాహనాల స్వాధీనం
2019 లంచం కేసులోనూ ఇదే అధికారి అరెస్టు

హైదరాబాద్, జూలై 22 (Zindagi9News): ఖైరతాబాద్లోని రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (REDCO) డివిజనల్ ఇంజినీర్ ముత్యం వెంకట రమణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసింది. అవినీతి ద్వారా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై బుధవారం ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సోదాల్లో నాలుగు నివాస ఫ్లాట్లు, రెండు వాణిజ్య భవనాలు, భార్య పేరుతో నమోదైన నిర్మాణ సంస్థల ద్వారా సుమారు రూ.20 కోట్ల పెట్టుబడులతో నిర్మించిన 10 అపార్ట్మెంట్లు, బ్యాంకు ఖాతాల్లో రూ.52.02 లక్షలు, 2,094 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు కార్లు, సుమారు రూ.30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, 20 మద్యం సీసాలు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.27.65 కోట్లుగా అంచనా వేయగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
ఇప్పటికే 2019లో ఇదే అధికారి డివిజనల్ ఇంజినీర్గా పనిచేస్తున్న సమయంలో రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి అరెస్టైన విషయం తెలిసిందే. ఆ కేసులోనూ సోదాల సందర్భంగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుర్తించిన ఆస్తులతో కలిపి అధికారి మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.28.14 కోట్లుగా అంచనా వేసినట్లు ఏసీబీ వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపింది.
