
- రూ.30 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన శామీర్పేట్ తహసీల్దార్ సుచరిత, డ్రైవర్ నగేష్
మేడ్చల్-మల్కాజిగిరి, మే 26(zindagi9news):
భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ శామీర్పేట్ మండల తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ & జాయింట్ సబ్-రిజిస్ట్రార్ టి. సుచరిత ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఆమెతో పాటు లంచం డబ్బులు స్వీకరిస్తున్న ప్రైవేట్ డ్రైవర్ వి. నగేష్ను కూడా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు.
ఫిర్యాదుదారునికి చెందిన 30 ఎకరాల వ్యవసాయ భూమిని నాలా (Non-Agricultural Land – NALA) కన్వర్షన్ చేయడానికి సంబంధించిన దరఖాస్తులను ప్రాసెస్ చేసి ఆమోదించేందుకు తహసీల్దార్ సుచరిత రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం తొలి విడతగా రూ.2 లక్షల నగదును తన ప్రైవేట్ డ్రైవర్ వి. నగేష్ ద్వారా స్వీకరిస్తున్న సమయంలో రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. డ్రైవర్ వద్ద నుంచి రూ.2 లక్షల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అధికార హోదాను దుర్వినియోగం చేస్తూ అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించినందుకు తహసీల్దార్ సుచరిత (AO-1), డ్రైవర్ నగేష్ (AO-2)లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
అరెస్టు చేసిన నిందితులను నాంపల్లిలోని ఫస్ట్ అడిషనల్ స్పెషల్ జడ్జ్ ఫర్ SPE & ACB కేసుల కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ నెంబర్: 9440446106, ఫేస్బుక్: Telangana ACB, ఎక్స్ (ట్విట్టర్): @Telangana ACB ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని ఏసీబీ స్పష్టం చేసింది.
